తిప్పేశ్వర్ అడవుల నుండి బోథ్ అడవుల్లో ప్రవేశించిన పెద్దపులి..
ఏడాది కాలం లో రెండవ సారి పులి పర్యటన….

ఆదిలాబాద్ జిల్లా బోథ్ అడవుల్లో పులి మరోసారి ప్రవేశించింది..తాజాగా బోథ్ నారాయణ్ పూర్, రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో అడవిలో అమర్చిన కెమెరాలలో పెద్దపులి కదలికలు కనిపించాయి.. .రుతుపవనాల ఆగమాన ప్రభావంతో కలయిక కోసం తోడును వెతుక్కుంటూ తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి కవ్వాల్ అభయారణ్యంకు ప్రయాణంలో భాగంగా భీంపూర్,తలమడుగు, డెడ్రా, ఘన్పూర్, నిగిని, మర్లపెల్లి అడవుల మీదుగా బోథ్, సారంగపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు.. తాజాగా బోథ్, సారంగాపూర్ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని అమర్చిన కెమెరాలలో పులి కదలికలను గుర్తించినట్లు బోథ్ అటవీ రేంజ్ అధికారి ప్రణయ్ తెలిపారు..బోథ్ అటవీ ప్రాంతంలో మూడు రోజులలో పులి 32 కిలోమీటర్ల దూరం సంచరించినట్లు అధికారులు గుర్తించారు…ప్రస్తుతం పులి అడవిలోనే సంచరిస్తుందని,జనసంచారం ఉండే ప్రాంతాలకు రావడం లేదని కాబట్టి అటవీ సమీప గ్రామాలలో ఉండే జనాలు భయపడాల్సిన అవసరం లేదని కాని అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు అటవీ అధికారులు…
దట్టమైన కీకారణ్యం, పులి నివాసానికి ఆమోదయోగ్యం..
బోథ్ మండలానికి దక్షిణాన ఉన్న అటవి ప్రాంతం 1,600 హెక్టార్లలో దట్టంగా విస్తరించి ఉంది.. పులి ఆహారానికి సరిపడా సాధు జంతువులు అడవిలో సమృద్ధిగా ఉండడంతో ప్రస్తుతం బోథ్ అటవీ ప్రాంతం పులి నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంది దీంతో ఎలాంటి ఆటంకాలు కలగకపోతే మరి కొన్ని రోజుల పాటు పులి బోథ్ అడవుల్లోనే సంచరించే అవకాశం ఉంది…
ఏడాది కాలం లో పులి రెండవ సారి పర్యటన…
గడిచిన సంవత్సర కాలంలో బోథ్ అడవుల్లో పులి సంచారం ఇది రెండవ సారి.. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలాలో బోథ్ అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు సంచరించిన పులి ఆ తరువాత సారంగాపూర్, భైంసా అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు సంచరించి చివరికి ఎట్టకేలకు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశంచింది..సాధారణంగా కేవలం తోడు కోసం మాత్రమే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పులులు వలస వెళ్తాయి.. తిప్పేశ్వర్ అభయారణ్యంలో ఉండే పులులు తోడు కోసం కవ్వాల్ అభయారణ్యనికి వలస వెళ్లడం అనాదిగా వస్తుంది… తిప్పేశ్వర్ నుండి కవ్వాల్ కు వెళ్లడానికి పులులు పెన్ గంగా నదిని దాటి జిల్లా లోని భీంపూర్, తాంసీ, తలమడుగు మీదుగా బజార్హత్నూర్ మండలం లోని డెడ్రా అడవుల ప్రవేశించి బోథ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం గుండా నిగిని, మర్లపెల్లి అడవుల్లో ప్రవేశించి ఆపై బోథ్, సారంగాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రవేశించి అక్కడి నుండి సారంగపూర్, మామడ అడవిగుండా ప్రయాణించి కవ్వాల్ అభయారణ్యానికి చేరుకోవడం సాంప్రదాయ మార్గంగా ఉంది… ప్రతి ఏడాది ఈ మార్గంగుండానే పులులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తు ఉంటాయి…
పులులు వస్తున్నా పట్టింపు ఏది…?
ప్రతి ఏడాది తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నా అటవీ శాఖ నుండి కనీస స్పందన ఎందుకు ఉండడం లేదనేది ప్రశ్నర్ధకంగా మారింది… గత దశబ్ద కాలంలో ప్రతి ఏడాది పులులు వస్తున్నప్పటికి జాతీయ రహదారి దాటి మామడ అటవీ ప్రాంతంలో పులులు ప్రవేశించిన దాఖలాలు లేవు..గత ఏడాది ఎట్టకేలకు పులులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశించిన అక్కడ పులి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.. తోడే లక్ష్యంగా వలస వస్తున్నా పులుల కోసం ఆడ పులులను కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తీసుకుని వస్తే వలస వస్తున్నా పులులు ఆగడంతో పాటు కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులుల ఆవాసం మొదలయ్యి, పులుల సంఖ్య పెరిగే అవకాశం కూడ ఉన్నప్పటికీ అటవీశాఖ ఆవైపు ఎందుకు ఆలోచించడం లేదనేది ప్రశ్నర్థకంగా మారింది.. ఇప్పటికైనా ప్రస్తుతం బోథ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి కవ్వాల్ అటవీ ప్రాంతంలో విజయవంతంగా చేరి, కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులి నివాసం ఉండేలా అడవిని నివాస ఆమోదయోగ్యంగా మార్చేందుకు కృషి చేయాలనీ ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.